ఒకరిని చూసి మరొకరు...

ఒకరిని చూసి మరొకరు...
విస్తరిస్తోన్న టైజమ్
నాడు వికారుద్దీన్... నేడు ‘ఐసిస్’ త్రయం
‘ఇన్‌స్పైర్’ చేసిన ఇద్దరూ నల్లగొండ వారే
 

ఉగ్రవాద విషవృక్షం నగరంలో నానాటికీ వేళ్లూరుకుంటోంది. ఒకరిని చూసి మరొకరు అదే బాట పడుతున్నారు. నాడు వికారుద్దీన్... నేడు ‘ఐసిస్ త్రయం’ విషయంలో ఇదే జరిగింది. వీరు పట్టుబడిన తరవాతే ‘రోల్ మోడల్స్’ వ్యవహారం వెలుగులోకి రావడం పరిపాటిగా మారింది.  

ఫసీ బాటలో వికార్ గ్యాంగ్... నల్లగొండ జిల్లా బోనాల్‌పల్లికి చెందిన మహ్మద్ ఫసీయుద్దీన్ అలియాస్ ఫసీ నగరానికి చెందిన మీర్ మహ్మద్ అలీ, అజీజుద్దీన్ తదితరులతో ఓ ముఠా కట్టాడు. తొలినాళ్లలో ఈ గ్యాంగ్ చోరీలు, స్నాచింగ్స్, దోపిడీలకు పాల్పడింది. 1992లో ‘బాబ్రీ’ అనంతరం ఉగ్రవాద బాట పట్టింది. దీనికి ప్రతీకారంగా ఏ సంస్థతోనూ సంబంధాలు పెట్టుకోకుండా స్వీయ నిర్ణయాలతో ఆపరేషన్స్ చేశారు. ద్విచక్ర వాహనాలపై సంచరిస్తూ 1993 జనవరి 20న కంచన్‌బాగ్‌లోని కనకదుర్గ వైన్స్‌పై దాడి చేసి జి.శ్రీనివాస్‌గౌడ్, బి.దయానంద్‌లపై హత్యాయత్నం చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే చాదర్‌ఘాట్‌లో వీహెచ్‌పీ లీడర్ పాపయ్య గౌడ్‌ను, 1993 ఫిబ్రవరి 2న అంబర్‌పేట పరిధిలో బీజేపీ నేత నందరాజ్ గౌడ్‌ను హత్య చేశారు. పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ, మీర్‌లు 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

నగరంలోని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన వికారుద్దీన్ 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుడు, పోలీసు కాల్పుల తర్వాత ఆజ్ఞాతంలోకి వెళ్లాడు. సులేమాన్,హనీఫ్ తదితరులతో కలిసి ముఠా కట్టి 2008 డిసెంబర్ 3న సంతోష్‌నగర్‌లో సీఐ సెల్ పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆపై తెహరీఖ్-గల్బా-ఏ-ఇస్లా (టీజీఐ) పేరులో ఏకంగా సంస్థనే ఏర్పాటు చేసి 2009 మే 18న ఫలక్‌నుమలో, ఆ తర్వాత శాలిబండలో హోంగార్డు బాలస్వామి,కానిస్టేబుల్ రమేష్‌లను పొట్టనపెట్టుకున్నాడు. ద్విచక్రవాహనంపై తిరుగుతూనే ఈ ఆపరేషన్స్ చేశా డు. 2010 జూలైలో చిక్కిన వికార్ గ్యాంగ్ పోలీసుల విచారణలో ఫసీ వ్యవహారం బయటపెట్టింది. వికారుద్దీన్ సహా ఐదుగురూ గతేడాది ఆలేరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

సలావుద్దీన్‌ను చూసి ‘త్రయం’...
 నల్లగొండకు చెందిన సలావుద్దీన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం ముంబై వెళ్లిన సలావుద్దీన్ అక్కడి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) క్యాడర్‌తో సంబంధాలు పెట్టుకున్నాడు.  1998 వరకు నార్తన్ రీజన్ కమాండర్‌గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. ఆపై రెండేళ్ల పాటు సిమికి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించాడు. 2001లో సిమిని కేంద్ర నిషేధించడంతో సలావుద్దీన్ దుబాయ్‌కు మకాం మార్చాడు. 2011లో కేరళలో చిక్కిన ఇతడు... 2014 అక్టోబర్‌లో నల్లగొండ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. - సిటీలోని చాంద్రాయణగుట్ట, హుమాయున్‌నగర్‌లకు చెందిన అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్ సమీప బంధువులు. బాసిత్, మాజ్‌లు 2014లో మరో ఇద్దరితో కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లో చేరేందుకు వెళ్తూ కోల్‌కతాలో చిక్కారు. కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టగా... ఒమర్‌తో కలిసి గత నెలలో అదే ప్రయత్నంలో శ్రీనగర్‌కు వెళ్తూ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. ఈ ముగ్గరూ తాము తమ సమీప బంధువైన ‘సిమి’ ఆలిండియా మాజీ చీఫ్ సలావుద్దీన్‌ను చూసి స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. ఈ ముగ్గురినీ మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సిట్ లోతుగా విచారిస్తోంది.

Post a Comment

Powered by Blogger.